భారత్ తరహాలో మాతోనూ అణు ఒప్పందం చేసుకోండని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ అమెరికాకు విజ్ఞప్తి చేశారు. భారత్-అమెరికాలు పౌర అణు ఒప్పందం చేసుకుని అమలుకోసం యత్నాలు చేస్తున్న తరుణంలో పాకిస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత చేకూరింది. భారత్-యూఎస్ల ఒప్పందాన్ని పాకిస్థాన్ వ్యతిరేకించటం లేదని స్పష్టం చేశారు.
పొరుగు దేశమైన భారత్తో చేసుకున్న ఒప్పందాన్ని తమతో కూడా చేసుకోవాలని అమెరికాను అభ్యర్ధిస్తున్నామని వివరించారు. పాకిస్థాన్ కూడా విద్యుత్ కొరతను ఎదుర్కొంటుందని తెలిపారు. దీనిని అధిగమించాలంటే అణు విద్యుదుత్పత్తి సరైనదని తాము భావిస్తున్నామని చెప్పారు.
భారత్తో తాము అన్నిరకాల సంబంధాలను మెరుగుపర్చుకుంటున్నామని తెలియజేశారు. వాణిజ్యం, ఆర్ధికం వంటి రంగాలకు ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్ల మధ్య ఆర్ధిక సంబంధాలు పటిష్టం చేసుకునేదానిపై తమ ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. ఆప్ఘనిస్థాన్లో ఉగ్రవాదానికి తాము ఊతం ఇస్తున్నామన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
పాకిస్థాన్-ఆఫ్ఘన్ సరిహద్దు వెంట దాదాపు లక్షమంది సేనలు తాము మోహరించామని తెలిపారు. అలాగే వేయి తనిఖీ కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకుందని వివరించారు. ఆప్ఘనిస్థాన్ వైపు ఇదే మాదిరిగా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా ఖురేషీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్రిటన్ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. బ్రిటన్ పర్యటనలో భాగంగా ప్రతిపక్ష నేత డేవిడ్ కామెరూన్, ఇతరులతో ఖురేషీ మంతనాలు జరపనున్నారు.
|