పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొంటానని ఆ దేశ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అభిశంసన తీర్మానానికి ముందే పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని ఆయన శుక్రవారం తేల్చి చెప్పినట్టు ముషారఫ్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పాక్ అధికార ప్రభుత్వం ముషారఫ్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న విషయం తెల్సిందే.
దీంతో తన పార్టీ పీఎంఎల్ (క్యూ)కు చెందిన నేతలతో ముషారఫ్ సమాలోచనలు నిర్వహించారు. ఇందులో.. అభిశంసనతో సహా పలు అంశాలపై కూలంకుశంగా చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా.. అధికార ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని ప్రజాస్వామ్య పద్దతిలోనే ఎదుర్కోవాలని ముషారఫ్ సుస్పష్టం చేసినట్టు సమాచారం.
ఉన్నత విలువలతో, రాజ్యాంగబద్ధంగా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాయని, తనను తొలగించేందుకు ఎలాంటి కారణం లేదని ఆయన చెప్పినట్టు అనుచరులు వెల్లడించారు. అంతకుముందు పీఎంఎల్ (క్యూ) చీఫ్ చౌదరి షాజాత్ హుస్సేన్, ఆయన బంధువు, జాతీయ అసెంబ్లీ పార్టీ నేత చౌదరీ పర్వేజ్ ఇలాహిలు రావల్పిండిలోని క్యాంపు కార్యాలయంలో ముషారఫ్తో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా.. ఎదుర్కోనున్న అభిశంసన తీర్మానంపై చర్చించినట్టు సమాచారం. సమావేశానంతరం హుస్సేన్, ఇలాహీలు ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ.. అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోనని ముషారఫ్ స్పష్టం చేసినట్టు వారిద్దరు చెప్పారు. ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన పక్షంలో దాన్ని, ప్రజాస్వామ్య పద్దతిలో రాజ్యాంగ బద్ధంగా ఎదుర్కోనున్నట్టు అధ్యక్షుడు చెప్పినట్టు వారు వివరించారు.
|