ఎన్నోరోజులుగా నేపాల్లో ఏర్పడ్డ రాజకీయ ఉత్కంఠకు తెర దిగింది. మాజీ మావోయిస్ట్ నేత పుష్పకమల్ దహాల్ అలియాస్ ప్రచండ సోమవారం గణతంత్ర నేపాల్కు సరికొత్త ప్రధానిగా పీఠాన్ని అధిరోహించారు. సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గెరిల్లా పోరాటంలో ఆరితేరిన ఆయన సంకీర్ణాన్ని కూడ గట్టడానికి నాలుగు నెలలు పట్టింది.
సంప్రదాయ దుస్తులను పక్కన పెట్టిన ఆయన పాశ్చాత్య దుస్తులను నల్లటి టోపీ ధరించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. నేపాల్ అధ్యక్షుడు రామ్ బరణ్ యాదవ్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన సచివాలయానికి విచ్చేశారు. అక్కడ ప్రధాని బాధ్యతలు స్వీకరించారు.
శుక్రవారం నుంచి నేపాల్లోని పలు పార్టీల మధ్య అధికారపీఠం, మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయి. ప్రధాన శాఖలు ఎవరికి ఇవ్వాలనే అంశం సోమవారానికి కూడా సందిగ్ధంలోనే ఉండిపోయింది. అయితే ప్రచండ ప్రమాణ స్వీకారానంతరం ఈ విషయంపై చర్చలు జరుగుతాయి. 24 మంది సభ్యులు ఉండబోయే మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనేది వేచి చూడాల్సిందే.
|