పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి మరో భాగస్వామ్య పార్టీ అయిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) పార్టీ వైదొలగింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోమవారం సాయంత్రం ప్రకటించారు.
సంకీర్ణ ప్రభుత్వం నుంచి తప్పుకొని, ప్రతిపక్షంలో కూర్చోనున్నట్టు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా.. వచ్చే నెల ఆరో తేదీన జరుగనున్న దేశ అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థిని బరిలోకి దింపనున్నట్టు ప్రకటించారు.
పీఎంఎల్ (ఎన్) సీనియర్ నేత సయీద్ సిద్ధిక్యూను అధ్యక్ష అభ్యర్థిగా నిలబెడుతున్నట్టు చెప్పారు. పాక్ సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక భాగస్వామ్య పార్టీ అయిన షరీఫ్ పార్టీ వైదొలగడంతో పాక్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది.
దీనిపై షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి)పై ఉన్న నమ్మకం పోయిందని, అందువల్ల తాము ప్రభుత్వ నుంచి వైదొలగినట్టు చెప్పారు. ఇకపై ప్రతిపక్ష స్థానంలో కూర్చొంటామన్నారు. ఆది నుంచి పిపిపి, పీఎంఎల్ (ఎన్) పార్టీల మధ్య అభిప్రాయబేధాలు నెలకొన్న విషయం తెల్సిందే.
ముఖ్యంగా ముషారఫ్ సైనిక పాలకుడిగా ఉన్న సమయంలో పాక్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తొలగించారు. వీరిని తిరిగి నియమించాలని ఆయన పట్టుబట్టారు. దీనిపై రెండు దఫాలుగా డెడ్లైన్ కూడా విధించారు. తాజాగా విధించిన డెడ్లైన్ను పిపిపి కొ-ఛైర్మన్ జర్ధారీ తోసిపుచ్చారు.
అంతేకాకుండా వచ్చే నెల ఆరో తేదీన జరుగనున్న దేశ అధ్యక్ష ఎన్నికల్లో పిపిపి తరపున అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈ పరిణామాలు షరీఫ్కు ఆగ్రహం తెప్పించడంతో ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.
|