పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వానికి గుడ్బై చెప్పిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత జర్దారీ క్షమాపణలు చెప్పారు. దేశంలో న్యాయమూర్తుల పునర్నియామక విధానాలతో తలెత్తిన విభేదాలతో కలత చెందిన నవాజ్ షరీఫ్ పాక్ సంకీర్ణ ప్రభుత్వానికి సోమవారం గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ విషయమై పీపీపీ అధినేత జర్దారీ మంగళవారం నవాజ్ షరీఫ్కు క్షమాపణలు చెప్పారు. దేశంలో ప్రజాస్వామిక పాలనకు ప్రాణం పోసేందుకు వీలుగా, విభేదాలను విస్మరించి కలిసి పనిచేద్దామని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ అధ్యక్ష పదవికి సెప్టెంబర్ 6న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ దేశ అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా సుమ్రో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష స్థానం ఖాళీ అయిన నెలరోజుల్లోపు కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగా ఆగస్టు 26 నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలవుతుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. అధ్యక్ష పదవికి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత ఆసిఫ్ అలీ జర్దారీని పోటీలో నిలపాలని ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు.
|