పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. ఆ దేశ ప్రధాని యూసఫ్ రజా గిలానీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం చోటు చేసుకున్న ఈ పరిణామాలతో పాక్ ప్రభుత్వ వర్గాలు దిగ్భ్రమకు లోనయ్యాయి. పాకిస్థాన్ సైనిక కేంద్రమైన రావల్పిండి సమీపంలో ఈ దాడి జరిగింది.
ఈ ప్రాంతంలో వెళుతున్న గిలానీ కాన్వాయ్పై ఉగ్రవాదులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల నుంచి గిలానీని భద్రతా సిబ్బంది సురక్షితంగా తప్పించారు. ఈ కాల్పుల తర్వాత ప్రధాని గిలానీ కొంత షాక్కు గురై ఉన్నారని భద్రతా వర్గాలు వెల్లడించాయి.
ఇదిలావుండగా బుధవారం ఉదయం పాకిస్థాన్లోని తీవ్రవాద స్థావరాలపై అమెరికా సైనికులు దాడి చేశారు. ఈ దాడుల్లో ఐదుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోగా మరో 55 మందికి పైగా గాయాలపాలైనట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఇదే తరహాలో అమెరికా దాడులు నిర్వహించిన విషయం తెల్సిందే.
|