పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంపై ఆప్ఘన్ సరిహద్దుల వైపు నుంచి అమెరికా నేతృత్వంలోని నాటోబలగాలు ఏకపక్షంగా బుధవారం జరిపిన దాడులను పాక్ తీవ్రంగా ఖండించింది. పాక్కు ముందస్తు సమాచారం లేకుండా నాటో బలగాలు జరిపిన ఈ వైమానిక దాడిలో 20 మంది పాక్ పౌరులు మరణించిన ఘటనను పాక్ సెనేట్ తీవ్రంగా ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
పాక్ సరిహద్దు ప్రాంతంలో నాటోబలగాలు చేసిన ఏకపక్ష దాడి అంతర్జాతీయ చట్టాలు పేర్కొంటున్న ప్రాధమిక అంశాలను కూడా ఉల్లంఘించిందని పాక్ జాతీయ సభ ఈ తీర్మానం ద్వారా గర్హించింది. ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లోంచి అదనపు విమానాల దన్నుతో నాటోబలగాల చినూక్ యుద్ధ హెలికాప్టర్ చేసిన దాడి పాక్ సార్వభౌమత్వానికి, ప్రాథమిక సమగ్రతకు గొడ్డలిపెట్టులాంటిదని పాక్ జాతీయ సభ తీర్మానించింది.
ఈ దాడి అంతర్జాతీయ చట్టాల ప్రాధమిక నిబంధనలను సైతం తోసిపుచ్చిందని, పాకిస్తాన్ సైనిక బలగాలకు, ఆప్ఘనిస్తాన్లోని సంకీర్ణ బలగాలకు మధ్య కొనసాగుతున్న సహకార పునాదిని సైతం ఇది దెబ్బతీసిందని పాక్ జాతీయ సభ తీర్మానం గర్హించింది.
పాకిస్తానీ భూభాగంలోకి దూసుకొచ్చి అమాయక పౌరులను వధించిన ఈ ఘాతుక చర్యను పాక్ జాతి సహించబోదని, ఆప్ఘనిస్తాన్లోని నాటో సంకీర్ణ కూటమి దేశాల దృష్టిక్ ఈ ఘటనను తీసుకుపోతామని ఈ తీర్మానం పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగితే వాటిని ఎదుర్కొని పాక్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడే అన్ని చర్యలు చేపట్టవలసిందిగా ఈ తీర్మానం పాక్ ప్రభుత్వానికి పిలుపిచ్చింది.
|