తన భూభాగంలో అమెరికా ఆధ్వర్యంలోని సంకీర్ణ కూటమి దళాలు తలపెట్టిన దాడిని పాక్ తీవ్రంగా ఖండించిన నేపథ్యంలో తమ రెండు దేశాల మధ్య సంబంధాలు దృఢంగా ఉన్నాయని అమెరికా నొక్కి చెప్పింది. తాలిబాన్ మరియు అల్ఖైదా శక్తులతో ఉమ్మడిగా పోరాడేందుకు ఉభయులమూ మరింత సన్నిహితంగా పనిచేస్తామని అమెరికా స్పష్టం చేసింది.
పాకిస్తాన్తో మా సంబంధం చాలా దృఢంగా ఉందని, ఉగ్రవాదంపై పోరులో పాక్ తమకు అత్యంత సన్నిహిత దేశమని అమెరికా విదేశీ శాఖ వ్యాఖ్యాత రాబర్ట్ ఉడ్ పేర్కొన్నారు. పాకిస్తాన్తో కలసి పనిచేయడాన్ని తాము కొనసాగిస్తామని, ఇదేమంత సులభం కాదని చెప్పారు.
తాలిబాన్, అల్ఖైదా ఉగ్రవాదుల నుంచి ఎదురవుతున్న ప్రమాదాన్ని అమెరికాలాగే పాక్ కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తోందని ఉడ్ ప్రశంసించారు. పాకిస్తాన్ భూభాగంలోనే కాకుండా ఆప్ఘనిస్తాన్ సరిహద్దులలోనూ పనిచేస్తున్న ఉగ్రవాద శక్తులను ఓడించడంలో ఇరు దేశాలు మరింత సహకార భావనతో మెలుగుతాయని చెప్పారు.
అయితే పాక్తో పొత్తును చాలా కీలకంగా భావిస్తున్నట్లుగా పేర్కొన్న అమెరికా విదేశీ మంత్రిత్వ శాఖ రెండు రోజుల క్రితం పాక్ భూభాగంలో నాటో సంకీర్ణ దళాలు చేసిన దాడిని ప్రస్తావించలేదు. పాక్ భూభాగంలోని సరిహద్దు గ్రామంలో ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి తెల్లవారక ముందు నాటో దళాలు చేసిన దాడిలో 20 మంది పౌరులు చనిపోయిన ఘటనను పాక్ తీవ్రంగా భావించిన విషయం తెలిసిందే.
|