అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి పూర్తిగా కట్టుబడి ఉన్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రకటన న్యూక్లియర్ సరఫరా గ్రూపు (ఎన్ఎస్జి) దేశాలను ఎంతో ప్రభావితం చేసింది. దీంతో అణు సరఫరా దేశాల కూటమి నుంచి భారత్కు పూర్తిస్థాయి భేషరతు మినహాయింపు ఇచ్చే విషయంపై మరింత పురోగతి లభించింది. అయితే రెండు రోజుల పాటు సాగిన చర్చల్లో 45 సభ్య దేశాల కూటమి ఏకాభిప్రాయానికి మాత్రం రాలేక పోయింది.
దీంతో భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం మరో సారి ఎన్ఎస్జి భేటీ కానుంది. ఇందులో తుది నిర్ణయం తీసుకోనున్నారు. తాజా సమాచారం మేరకు ఒక్క న్యూజీలాండ్ మాత్రమే భారత్కు వ్యతిరేకంగా వాదిస్తోంది. ఆ దేశంపై అమెరికా ప్రతినిధులు అన్ని రకాల ఒత్తిడి తెస్తున్నారు. ఎలాగైనా న్యూజీలాండ్ను కూడా ఒప్పించేందుకు బుష్ యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఇదిలావుండగా, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టమైన ప్రకటన ఒకటి చేశారు. భారత్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు. అణుపరీక్షలపై స్వచ్ఛంద నిషేధాన్ని నిబద్ధతతో అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కలల సాకారమైన అణ్వస్త్ర రహిత సమాజం కోసం భారత్ కృషి చేస్తుందని ప్రణబ్ ముఖర్జీ తన ప్రకటనలో పేర్కొనడంతో ఎన్ఎస్జికి చెందిన పలు దేశాలు మెత్తబడ్డాయి.
|