పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కొ-ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ ఎన్నిక కావడం పట్ల ప్రపంచ దేశాలకు చెందిన నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన పాక్ అధ్యక్ష ఎన్నికల్లో జర్దారీ భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెల్సిందే. పార్లమెంట్లోని 426 ఓట్లకు గాను జర్దారీకి 281 ఓట్లు పోలయ్యాయి. అలాగే నాలుగు ప్రొవియన్స్లలో పంజాబ్ రాష్ట్రం మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఆయన విజయదుందుభి మోగించారు.
ఈ నేపథ్యంలో జర్దారీ ఎన్నిక పట్ల అమెరికాతో పాటు.. పలు ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. దీనిపై వైట్హౌస్ ప్రతినిధి గార్డాన్ జాన్డ్రోవ్ ఒక ప్రకటన విడుదల చేశారు. జర్దారీ, ప్రధాని గిలానీతో కలిసి పని చేసేందుకు అధ్యక్షుడు జార్జి బుష్ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. అలాగే ఇరు దేశాల మధ్య ఉన్న ప్రధాన సమస్యలపై పాకిస్థాన్ దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
ఇకపోతే ఉత్తర ఆఫ్రికా పర్యటనలో ఉన్న యూఎస్ సెక్రటరీ కండోలినా రైజ్.. జర్దారీ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. తీవ్రవాదంపై ఆయన చేస్తున్న పోరాటాన్ని ఆమె ప్రశంసించారు. ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మాట్లాడుతూ.. జర్దారీ ఎన్నిక సరైన మార్గంలో జరిగిందన్నారు. అలాగే కాబూల్, ఇస్లామాబాద్ల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయనే ఆశాభావన్ని వ్యక్తం చేశారు.
మిలిటెంట్ల ఆగడాల కారణంగా.. పాకిస్థాన్-ఆఫ్గనిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయన్నారు. తీవ్రవాదుల ఆగడాలకు పాకిస్థాన్ కారణమని ఆఫ్గనిస్థాన్ అంటుండగా, పాకిస్థాన్ మాత్రం వీటిని తోసిపుచ్చుతోంది.
బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ మిలిబాండ్ మాట్లాడుతూ.. పాక్ అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దేశంలో స్థిరత్వం నెలకొల్పి, తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఇరాన్, ఆస్ట్రేలియా దేశాల ప్రతినిధులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
|