భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టపరుచుకోనున్నట్టు కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులోభాగంగా అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించుకునే వీలుగా భారత్ తమతో చర్చలు జరుపుతోందని కెనడా విదేశాంగ మంత్రి ప్రతినిధి లీసా మోనెట్ వెల్లడించారు. గత నెలలో రెండు దేశాలూ ప్రాథమిక స్థాయి చర్చలను పూర్తి చేశాయని త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునే దిశగా మళ్లీ సమావేశమవుతామని మోనెట్ తెలిపారు.
కాగా, భారత్ స్వయంగా ప్రకటించిన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి, నిరాయుధీకరణకు కట్టుబడి ఉంటుందనే విషయాన్ని కెనడా నమ్ముతుందని లీసా విశ్వాసం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ ఐదున భారత్ చేసిన ప్రకటన ఆధారంగా భారత్కు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ నిబంధల నుంచి మినహాయింపు ఇచ్చేందుకు కెనడా మద్దతిచ్చిందని ఆమె తెలిపారు. |