శ్రీలంక నుంచి పారిపోయి విదేశాల్లో తలదాచుకోనున్నానని తనపై వచ్చిన ఆరోపణలను తమిళ టైగర్ల అధినేత వేలు పిళ్లై ప్రభాకరన్ ఖండించారు. మాతృభూమిని వీడిపోయే ప్రస్తక్తే లేదని, తమ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తుది వరకు పోరాడతామని తేల్చి చెప్పారు. మంగళవారం ఒక ఈ మెయిల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాకరన్... లంక సైనిక దాడుల నేపధ్యంలో కిల్లినోచ్చి, ముల్లైతీవులు తమ వశం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించుకోవడాన్ని తోసిపుచ్చారు.శ్రీలంకలో తమిల పులులకు ఇప్పటికీ వేలాది మంది కార్యకర్తల బలం ఉందని, తమిళ ప్రజలందరి మద్దతు తమకు ఉందని ప్రభాకరన్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. కిల్లినోచ్చిలో ప్రభుత్వ బలగాలు భారీ నష్టాలు చవి చూశాయని, దీన్ని బట్టే అక్కడ పోరాటం ఎంత తీవ్ర స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కిల్లినోచ్చిని కాపాడుకోవాలని తమిళ ప్రజలు కోరుకున్నంత కాలం ఈ పుట్టణాన్ని కాపాడుకోవడానికి వారు గట్టిగా పాటుపడతారని ప్రభాకరన్ ధీమా వ్యక్తం చేశారు. అదేసమయంలో, భారత్ మద్దతు కూడా తమకు చాలా అవసరమని, రాజీవ్ గాంధీ హత్యానంతరం భారత్తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడం కోసం ఎల్టీటీఈ రాజకీయ దౌత్య మార్గాల ద్వారా ఇప్పటికీ కృషి చేస్తూ ఉందని టైగర్ల అధినేత తెలిపారు. |