ముంబైలో ఉగ్రవాదుల దాడి ఘటనకు కారకులైన వారిని భారత్కు అప్పగించడానికి బదులుగా దేశంలోపల వారిని కఠినంగా శిక్షించడానికి పాకిస్తాన్ ప్రభుత్వమే తగు చర్యలను తీసుకోవాలని అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్ను ఒత్తిడి పెడుతోంది. ముంబై ఘటనకు వెనుక ఉన్న సూత్రధారులను శిక్షించేందుకు గాను తగిన న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించవలసిందని అమెరికా ప్రభుత్వం పాక్ యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువస్తోంది. అమెరికా వైఖరిలో స్పష్టమైన తేడా వచ్చిందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. కొంతమంది ఉగ్రవాద అనుమానితులను పాక్ తమకు అప్పగించవలసి ఉంటుందని భారత్ చేసిన డిమాండుకు గతంలోమద్దతు తెలిపిన అమెరికా ఇప్పుడు పల్లవి కాస్తా మార్చింది. భారత్ విదేశీ మంత్రి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ముంబై ఉగ్రవాద సూత్రధారులపై చర్యలు తీసుకునే విషయంలో పాకిస్తాన్పై అమెరికా తీసుకువస్తున్న ఒత్తిడి పెద్దగా ఫలితాలు ఇవ్వలేదని చేసిన ప్రకటన అమెరికా వైఖరిలో మార్పుకు ప్రతిబింబిస్తోందని పరిశీలకులు భావన.లష్కరే తోయిబా కీలక నేతలను భారత్కు అప్పగించండం పాకిస్తాన్ ప్రభుత్వానికి అంత సులభం కాదని అమెరికా ప్రభుత్వ యంత్రాంగం గుర్తించిన నేపధ్యంలో వారిని పాక్లోనే విచారించి శిక్షించవలసిందిగా ప్రస్తుతం అమెరికా కొత్త పల్లవిని అందుకుంది.నేరస్తుల అప్పగింతకు సంబంధించి ఇరుదేశాల మధ్య ఎలాంటి ఒప్పందం లేనందున పాక్ పౌరులను భారత్కు తరలించడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం తీవ్రమైన చిక్కుల్లో పడుతుందని పాక్ వాదించింది. పాక్ పౌరులను భారత్కు అప్పగించిన ఫలితంగా ఏర్పడే రాజకీయ అస్థిరత, ప్రభుత్వాన్ని బలహీన పర్చడమే కాక, ఆప్ఘనిస్తాన్లోని అల్ఖైదా, తాలిబాన్ మిలిటెంట్లపై సాగిస్తున్న యుద్ధానికి కూడూ హాని చేస్తుందని పాకిస్తాన్ అమెరికా అధికారుల ముందు వాదించింది. దీని ఫలితమే అమెరికా పల్లవి మార్పుకు దారితీసిందని పరిశీలకుల వ్యాఖ్య. |