తన రాజకీయ రాజధాని కిలినోచ్చిని చేజార్చుకుని భారీగా దెబ్బ తిన్న ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరో టైగర్ల కీలక స్థావరం ముల్లైతీవులో దాగి ఉంటారని శ్రీలంక సైన్యాధిపతి శరత్ ఫోన్సెకా తెలిపారు. 54 ఏళ్లు నిండన ప్రభాకరన్ ముల్లైతీవు తీరప్రాంత పట్టణంలో దాగి ఉండవచ్చునని ఫోన్సెకా శుక్రవారం తెలిపారు. ప్రభాకరన్ దాగి ఉంటాడని భావిస్తున్న ప్రాంతంపై శ్రీలంక సైన్యం శుక్రవారం దాడి చేసిన విషయం తెలిసిందే. ముల్లైతీవు ఉత్తరాన 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన ప్రాంతంలో ఎల్టీటీఈ ప్రస్తుతం దిగ్బంధించబడి ఉందని ఆర్మీ ఛీఫ్ శరత్ చెప్పారు. ఈ ప్రాంతంలో ఓ బంకర్లో దాగి ఉన్న ప్రభాకరన్ను సజీవంగా పట్టుకోవాలని లంకసైన్యం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. 2006లో కొలంబోలోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఎల్టీటీఈ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన లంక సైనిక ఛీప్ పెను గాయాలకు గాను విదేశాల్లో చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. లంక సైన్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన టాస్క్ ఫోర్స్-2ను గత సంవత్సరం ముల్లైతీవులోని సీ టైగర్ల ప్రధాన కార్యాలయంపై దాడిలో మునిగి ఉన్న దళాలకు అదనంగా జోడించారు. ఇక్కడ భూగర్భంలో 30 అడుగుల లోతులో నిర్మించిన ఎయిర్ కండిషనర్ సౌకర్యం కలిగిన బంకర్ల సముదాయంలో ప్రభాకరన్ నివసిస్తున్నట్లుగా లంక పత్రిక తెలిపింది. ప్రభాకరన్ ఆదేశించిన విధంగా, అత్యంత సురక్షితమైన రీతిలో నిర్మించిన ఈ భూగర్భ బంకర్లో ఎయిర్ కండిషన్, విద్యుత్ ఉత్పత్తి మోటార్లు ఉన్నాయని బాటమ్లైన్ పత్రిక ఇటీవల నివేదించింది. శత్రువులు గుర్తించకుండా ఉండేందుకోసం ప్రభాకరన్ ఈ బంకర్లోంచి రాత్రి పూట మాత్రమే బయటకు వస్తుంటారని పత్రిక తెలిపింది. |