తమ చిట్ట చివరి స్థావరాన్ని నిలుపుకునేందుకోసం తీవ్రంగా పోరాడుతున్న తమిళ టైగర్ల తిరుగుబాటుదారులు సోమవారం 40మంది సైనికులను బలిగొన్నట్లు ప్రకటించారు. ముల్లైతీవు ఉత్తర ప్రాంతంలో టైగర్ల స్థావరాలను పట్టుకునేందుకు లంక సైనిక బలగాలు మోహరించి ఉన్నాయి. అయితే తమ బలగాలకు భారీ నష్టం సంభవించినట్లుగా వచ్చిన వార్తలను లంక అధికారులు తోసిపుచ్చారు. ముల్లైతీవు పట్టణం వేపుగా పురోగమించడానికి లంక సైన్యం చేసిన ప్రయత్నాలను తాము అడ్డుకున్నామని ఈ పోరులో 80మంది లంక సైనికులు గాయపడ్డారని టైగర్ల వెబ్సైట్ పేర్కొంది. స్వపక్షం భారీగా దెబ్బతినడంతో లంక సైనికులు ముందుకు రాకుండా ఆగిపోయారని టైగర్ల వెబ్సైట్ చెప్పింది. ఈలోగా, లంక బలగాలు కిలినోచ్చిని హస్తగతం చేసుకున్న తర్వాత వ్యూహాత్మకంగా కీలకమైన ఒడ్డుసుదన్ పట్టణంలో ప్రవేశించాయి. ఇది ముల్లైత్తీవు వైపుగా వెళ్లే ప్రధాన రహదారి కావడం వల్ల టైగర్లు దీన్ని సరకుల రవాణాకు, పాలనాపరమైన అవసరాలకు వాడుకునే వారు. |