ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో దాదాపు 40 మంది చనిపోయారు. ఈ పాఠశాల జెరూసలెంలోని జబాలియా పట్టణంలోవుంది. ఇందులో పాలస్తీనా శరణార్థులు వందలాదిగా తలదాచుకుంటున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం.
కాగా 11వ రోజుకు చేరిన ఈ దాడుల్లో మృతుల సంఖ్య 620కి చేరింది. ఇప్పుటివరకు 130 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. శత్రుదళాలు చుట్టుముట్టినా హమాస్ రాకెట్ దాడులను ఆపడంలేదు.
మంగళవారంనాడు 5 రాకెట్లను ఇజ్రాయెల్పైకి ప్రయోగించినట్లు సైన్యం పేర్కొంది. ఇదిలావుండగా మంగళవారం నాటిదాడుల్లో నలుగురు ఇజ్రాయెల్ సైనికులతో సహా 22 మంది హతమయ్యారు. ఈ సైనికులు ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకు అనుకోకుండా జరిపిన కాల్పుల్లో చనిపోయారని ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా పాలస్తీనా ప్రజల తరపున పోరడటానికి రెండువేలమంది అఫ్గాన్ యువకులు సిద్ధంగా ఉన్నట్లు అఫ్గానిస్థాన్ పార్లమెంటు సభ్యులు కాబూల్లో ప్రకటించారు. ఇదిలావుండగా గాజా పరిస్థితిపై చర్చించడానికి మంగళవారం వీరు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ ప్రస్తుతం ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అరబ్ దేశాలు ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడిని తీవ్రతరం చేశాయి. |