ప్రత్యేక తమిళ దేశం కోసం పోరాడుతున్న ఎల్టీటీఈ తమ రాజధాని కిలినోచ్చి పట్టణాన్ని శ్రీలంక సైన్యం నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడం అసాధ్యమేమి కాదని ధీమా వ్యక్తం చేసింది.
తమ ఆధీనంలో ఉన్న శ్రీలంక ఉత్తర ప్రాంతాన్నంతటిని స్వాధీనం చేసుకుని ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం యోచిస్తోందని దీనిని మేము ఖండిస్తున్నామని ఎల్టీటీఈ పేర్కొంది.
ఎల్టీటీఈ రాజకీయ విభాగం అధిపతి నటేశన్ తమిళ అనుకూల వెబ్సైట్ `తమిళ నెట్'తో మాట్లాడుతూ కిలినోచ్చిని లంక సైన్యం ఆదుపులోకి తీసుకోవడం ఇది మొదటిసారి కాదని తెలిపారు.
గతంలో కూడా ఇలాంటి సందర్భాల్లో తాము ఎప్పటికప్పుడు కిలినోచ్చిని తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. శ్రీలంక సైన్యం తన ఆధీనంలోకి తీసుకోవడం, మళ్ళీ మేము వారిపై పోరాడి తిరిగి స్వాధీనం చేసుకోవడం షరా మామూలేనని ఆయన పేర్కొన్నారు.
కిలినోచ్చిని తిరిగి తాము స్వాధీనం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇదివరకు కూడా శ్రీలంకలోని ఉత్తరాది రాష్ట్రాలలో ఎన్నికలు జరిపించి సైన్యానికి అనుకూలురైన వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేలా చూసి వారిని కీలు బొమ్మల్లా ఆడించడం జరిగిందని అన్నారు.
1977 ఎన్నికల్లో తామేమిటో నిరూపించుకున్నామని, తమిళ ప్రజలకు ఏకైక ప్రతినిధులం తామేనన్న ధీమాను ఆయన వ్యక్తపరిచారు. |