ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రాణంతో పట్టుబడ్డ కసబ్ మా వాడు కాదనీ నిన్నటివరకూ వాదించిన పాకిస్తాన్ ఎట్టకేలకు నిజాన్ని నిజం అని ఒప్పుకుంది. అజ్మల్ కసబ్ మా జాతీయుడేనని ఒప్పుకుంది. అమెరికా, పాక్ మిత్ర దేశాలనుంచి వస్తున్న ఒత్తిడుల నేపధ్యంలో ఈ మేరకు అంగీకరించినట్లు అక్కడి మీడియా వర్గాల సమాచారం.
తొలుత భారత్ ఇచ్చిన ఆధారాలను కొట్టి పారేసిన పాకిస్తాన్ చివరికి వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట కసబ్ మా వాడేనని అంగీకరించింది. పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అలీ దురాని ఒక ప్రైవేటు టెలివిజన్ ఛానల్తో మాట్లాడుతూ... ఆధారాలన్నీ పరిశీలించిన మీదట కసబ్ తమ జాతీయుడేనని ప్రకటించారు.
మన దేశంలో మంగళవారం ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మన్మోహన్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఊతమిస్తోందని ధ్వజమెత్తారు. అసలు వారి విధానమే ఉగ్రవాదం అని ఆరోపించారు. దీనితోపాటు అంతర్జాతీయ సమాజం నుంచి మరింత ఒత్తిడి రావడంతో పాకిస్తాన్కు వేరే దారిలేక నిజాన్ని ఒప్పుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాదు ముంబై ఉగ్రవాద దాడికి సంబంధించిన దర్యాప్తులో తాము మరింత సహకారాన్ని అందిస్తామని తెలియజేసింది. కనీసం ఈ మాటలకైనా పాకిస్తాన్ చివరి వరకూ కట్టుబడి ఉంటుందో లేదో వేచి చూడాలి. |