పాలస్తీనా తరహాలో పాకిస్తాన్పై దాడులు చేసే ఉద్దేశం భారత్కు లేదని దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న పరిస్థితులు వేరని ప్రణబ్ పేర్కొన్నారు. పాలస్తీనా-ఇజ్రాయెల్ సమస్యను.. భారత్-పాక్లతో సరిపోల్చమని ప్రణబ్ వెల్లడించారు.
పాక్ భూభాగంపై దాడి చేసి ఆక్రమించాలన్న ఉద్దేశం భారత్కు లేదని ప్రణబ్ తేల్చి చెప్పారు. అయితే ఉగ్రవాదంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన తెలిపారు. పాక్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలన్నదే తమ అభిమతమని ప్రణబ్ పేర్కొన్నారు. ఉగ్రవాద శిబిరాల దాడిపై పాక్ జాప్యం చేయడం ఏ మాత్రం సరికాదని తెలిపిన ప్రణబ్, పాక్ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. భారత వాణిజ్య నగరమైన ముంబై దాడి పాక్ కేంద్రంగానే జరిగిందని ప్రణబ్ తెలిపారు.
ఇదిలా ఉండగా... ముంబై దాడులకు సంబంధించి భారత్ సమర్పించిన ఆధారాలపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన లభించలేదని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆనంద్ శర్మ శనివారం విలేకరులతో చెప్పారు. పాకిస్తాన్ నుంచి అందనున్న సమాచారం మేరకే భారత్ ముంబై దాడులపై తగిన చర్యలు తీసుకోనుందని ఆనంద్ శర్మ అన్నారు. పాక్ అందజేయనున్న సమాచారం కోసం విదేశాంగ శాఖ వేచి ఉందని ఆనంద్ శర్మ స్పష్టం చేశారు. |