ఆర్థిక సంక్షోభ కోరల నుంచి గట్టెక్కేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. అమెరికా కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ లేనంత ఘోర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కోరల నుంచి బయటపడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని దీనికి అందరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆయన శుక్రవారం ఆదేశ ప్రజలనుద్ధేశించి రేడియోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కంటే అమెరికాను మరింత సర్వసమోన్నతమైన, శక్తివంతమైన దేశంగా రూపొందించే గురుతర బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉందన్నారు. అందువల్లే వైద్య విధానంలో సంస్కరణలు, బ్యాంకు రుణాల పునరద్ధరణ, ఉపాధి అవకాశాలను పెంచడం వంటి తదితర క్లిష్టమైన సమస్యలు ప్రస్తుతం మనముందున్నాయి.
ఇప్పటి వరకు 6.51 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని, ఈ సంఖ్యతో దేశంలో నిరుద్యోగ శాతం ఎనిమిది చేరుకుందన్నారు. ఈ పరిస్థితిని అధికమించేందుకు తీసుకున్న ప్రణాళికలలో కొన్నింటిని ఆయన ప్రజలకు వివరించారు. రుణదాతలు, రుణ గ్రహీతల మధ్య సమన్వం తీసుకువచ్చి ఆర్థిక పునర్నిర్మాణం చేయడం. చినిచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకుల చేత రుణాలు మంజూరు చేయించడం. తిరిగి డబ్బును మార్కెట్లోకి ప్రవహింపజేయడం వంటి వాటిని అమలు చేస్తామన్నారు. |