ముంబై దాడులకు సంబంధించి సాగుతున్న దర్యాప్తునకు పాకిస్థాన్ తన వంతు సహకారం అందించాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అభిప్రాయపడ్డారు. ఆసియా ఖండంలోని రెండు అణ్వస్త్ర దేశాల మధ్య తరచూ ఉద్రిక్తలు నెలకొనడం ఇరు దేశాలకు మంచిది కాదన్నారు. అసోచామ్ నిర్వహించిన ఇండియా టుడే సదస్సులో పాల్గొనేందుకు ఆయన శనివారం దేశ రాజధాని న్యూఢిల్లీకి వచ్చిన విషయం తెల్సిందే.
ఈ సందర్భంగా ముషారఫ్ మాట్లాడుతూ ముంబై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఉగ్రవాదులకు జాతీయత అంటూ ఏదీ ఉండదన్నారు. ఉగ్రవాదుల దాడిలో తాము కూడా బాధ్యులు ఉన్నామని, అందువల్ల భవిష్యత్లో ఇలాంటివి జరుగకుండా ఇరు దేశాల సమన్వయంతో వ్యవహించి దాడులను అరికట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
స్వదేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆయన వ్యాఖ్యానిస్తూ తమ దేశంలో అంతర్గత సమస్యలు పెద్ద ముప్పుగా పరిణమించాయన్నారు. ఈ పరిణామం దేశానికి అత్యంత హానికరమన్నారు. ఉగ్రవాదులపై పాక్ పాలకులు ఉక్కుపాదం మోపి, తీవ్రవాదుల కబంధ హస్తాల నుంచి దేశాన్ని రక్షించాలని ఆయన సూచించారు. |