ముంబయి ఉగ్రవాద దాడుల దర్యాప్తులో సేకరించిన డీఎన్ఏ వివరాలు తమకు అందజేయాలని ఆదివారం భారత్ను ఇంటర్పోల్ కోరింది. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి మారణహోమానికి సంబంధించి ఇటువంటి వివరాలనే ఇంటర్పోల్కు ఇచ్చేందుకు అంగీకరించింది.
ఇదిలా ఉంటే ముంబయి దాడుల నిర్వహణకు ఉగ్రవాద సంస్థలు సేకరించిన నిధులతో ఏడు దేశాలకు సంబంధం ఉందని ఇంటర్పోల్ చీఫ్ రొనాల్డ్ నోబెల్ వెల్లడించారు. భారత్తోపాటు యూరప్, మధ్యప్రాచ్య దేశాలతో ఈ నిధులకు సంబంధాలు ఉన్నాయన్నారు. అయితే దేశాల పేర్లు స్పష్టంగా వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వం కూడా తాము అడిగిన 30 ప్రశ్నలకు సమాధానాలను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని భారత్కు విజ్ఞప్తి చేసింది. ముంబయి దాడులకు సంబంధించి జరుపుతున్న దర్యాప్తులో పాకిస్థాన్ ప్రభుత్వం నలుగురు అనుమానితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరి రిమాండ్ ముగియడానికి 13 రోజుల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో.. పాక్ తామడిగిన ప్రశ్నలకు సాధ్యమైనంత త్వరగా సమాధానాలు పంపాలని కోరింది. |