ప్రపంచ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ ప్రస్తుతం పాకిస్థాన్లోనే స్థావరం ఏర్పరచుకుని ఉన్నాడని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా తెలిపారు. 2001 సెప్టెంబర్ 11న జరిగిన విమాన దాడులకు పాల్పడ్డ ఒసామా ఇంకా బ్రతికే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ దేశాలలో తమ నూతన యుద్ధనీతిని ప్రవేశపెడుతూ..ఒసామా మరియు అతని సహచరుడు ఐమన్ అల్ జవాహిరీ పాకిస్థాన్లోనే దాగున్నాడని తెలిపారు.
అల్ఖైదా తీవ్రవాదులు పాకిస్థాన్లోని అజ్ఞాత స్థావరాలలో దాగివున్నారని, వీరు అక్కడి నుంచి అమెరికాపై దాడులకు రూపకల్పన చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాని వారు అనుకున్నట్లు అమెరికా చేతులుముడుచుకుని కోర్చోలేదని, వారికి ధీటుగా సమాధానం చెప్పడానకి తమ సైన్యం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా హెచ్చరించారు.
అమెరికా ప్రజలకు నేను చెప్పేదేంటంటే ప్రస్తుతం పాకిస్థాన్ దేశానికి తమ సహాయం అవసరముందని అక్కడ తీవ్రవాదం పెరిగిపోవడంతో ఆదేశం సహాయంకోసం అర్రులుచాస్తోందని ఇలాంటి తరుణంలో వారికి మనం సహాయం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.
ఒకవేళ ఆఫ్గనిస్థాన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోతే లేక అల్ఖైదా తీవ్రవాదులకు స్వచ్ఛందంగా వారిపని వారు చేసుకునేలా తోడ్పడితే అక్కడ ఉగ్రవాదం పెరిగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా ఒబామా ఇదివరకు చేసిన వాగ్దానం మేరకు అమెరికా ద్వారా ఆఫ్గనిస్థాన్ ప్రభుత్వానికి తమ దేశంనుంచి అందించే సహాయంలో మూడ్లు రెట్లు అధికంగా ఉంటుందని ఇది రానున్న ఐదు సంవత్సరాలలో ఒకటిన్నర వెయ్యి కోట్ల డాలర్లుగా చెల్లిస్తామని తెలిపారు. |