గడ్డం, తలపాగా తీసివేస్తేనే మిలిటరీలోకి ప్రవేశం కల్పించే అమెరికా ఆర్మీ నిబంధనలను మార్చాలని సిక్కులు డిమాండ్ చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి మిలిటరీలో పనిచేసేందుకు సన్నద్ధమవుతున్న నాలుగో తరం వ్యక్తి కెప్టెన్ కమల్జిత్ సింగ్ కాల్సి సిక్కుల గడ్డం, తలపాగాకు సంబంధించిన అమెరికా ఆర్మీ నిబంధనలను మార్చాలని కోరుతున్నారు.
కల్సి, మరో సిక్కు కెప్టెన్ తేజ్దీప్ సింగ్ రతన్ జులైలో అమెరికా ఆర్మీలో చేరాల్సి ఉంది. అయితే వారిప్పుడు అమెరికా ఆర్మీ చట్టాల గురించి ఆలోచనలో పడ్డారు. 1980నాటి అమెరికా ఆర్మీ చట్టం ప్రకారం.. భద్రతా దళాల్లో చేరే వ్యక్తులు మతపరమైన వస్తువులు ధరించడం నిషిద్ధం. దీంతో ఆర్మీలో చేరేందుకు సిక్కులు గడ్డం, తలపాగా తీసివేయాల్సి ఉంటుంది.
సిక్కులకు గడ్డం, తలపాగా మతపరమైన విశ్వాసాల్లో భాగమైన సంగతి తెలిసిందే. కల్సి తండ్రి, తాత భారత వైమానిక దళంలో పనిచేశారు. వారు ముత్తాత బ్రిటీష్ ఇండియన్ ఆర్మీకి సేవలు అందించారు.
ఇదిలా ఉంటే అమెరికా ఆర్మీ ప్రతినిధి టోనీ డెలాన్సీ సిక్కు అభ్యర్థులు గడ్డం, తలపాగాకు సంబంధించి చేసిన విజ్ఞప్తులు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ఈ నిబంధనలను జులైకు ముందుగా మారే అవకాశం ఉందని అమెరికాకు చెందిన సిక్కు గ్రూపు నమ్మకం వ్యక్తం చేసింది. వీరిద్దరూ అమెరికా ఆర్మీలో యథాతథంగా చేరతారని సిక్కు గ్రూపు ప్రతినిధి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. |