పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జియా ఉల్ హక్, పలువురు ఉన్నతాధికారులను బలితీసుకున్న విమాన ప్రమాదంలో, తదనంతర దర్యాప్తులో తమ ప్రమేయం ఏ రకంగానూ లేదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. జియా విమాన ప్రమాదంలో అమెరికా ప్రమేయం ఉన్నట్లు వస్తున్న ఆరోపణనలను ఇస్లామాబాద్లోని అమెరికా దౌత్యకార్యాలయ అధికారి రిచర్డ్ స్నెల్సిర్ ఖండించారు.
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మాజీ చీఫ్ బ్రిగేడియర్ (రిటైర్డ్) ఇంతియాజ్ అహ్మద్ గతంలో జియా విమాన ప్రమాదం వెనుక అమెరికా హస్తం ఉందని ఆరోపించారు. అంతేకాకుండా జియా విమాన ప్రమాదంపై జరిగే దర్యాప్తును ప్రభావితం చేసేందుకు, నిలిపివేయించేందుకు అమెరికా ప్రయత్నించిందని కూడా పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ అమెరికా తోసిపుచ్చింది.
1988లో జరిగిన విమాన ప్రమాదంలో పాకిస్థాన్ అధ్యక్షుడు జియా ఉల్ హక్ మృతి చెందారు. జియా ఉల్ హక్ పెద్ద కుమారుడు ఇజాజ్ ఉల్ హక్ కూడా ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తును నిలిపివేసేందుకు అమెరికా తన బలాన్ని ఉపయోగించిందని ఆరోపించారు. ఈ ఆరోపణలను అమెరికా దౌత్య యంత్రాంగం తోసిపుచ్చింది. కేసులో వాస్తవాలు వెలుగుచూసేందుకు అమెరికా ఎల్లప్పుడూ సహకరించిందన్నారు.