ఆయుధాలు త్యజించిన ఉగ్రవాదులకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది.
ఉగ్రవాదాన్ని విడనాడిన ఉగ్రవాదులకు తాము ఉద్యోగావకాశాలతోపాటు మరిన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు నైజీరియా డెల్టాకు చెందిన మంత్రి ఉఫోట్ ఎకేటే తెలిపారు.
మంగళవారం తాము ఉగ్రవాదులకు పునరావాసం కల్పించేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేసామని, ఇందులో పలు అంశాలు చర్చకు వచ్చాయని, అందులో భాగంగా ఉగ్రవాదులు ఆయుధాలను త్యజించడంతో ముందుగా వారికి తాము ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన అన్నారు.
లొంగిపోయిన ఉగ్రవాదులకు ప్రభుత్వం శిక్షణనిచ్చి వారికి పునరావాసం కల్పించి, ఉద్యోగావకాశాలను కల్పించేందుకు తమ మంత్రి మండలి నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
ఇటీవల ప్రభుత్వం నుంచి ఉగ్రవాదులకు నమ్మకమైన ఒప్పందం లభించడంతో దాదాపు 10 వేల మందికిపైగా ఉగ్రవాదులు తమ ఆయుధాలను త్యజించి ప్రభుత్వం ఎదుట లొంగిపోయారని ఆయన వివరించారు.
వారు ప్రభుత్వంపై విశ్వాసంవుంచినందువలన తాము వారికి గతంలో చెప్పిన విధంగానే పునరావాసం కల్పించి ఆదుకుంటామని, అలాగే ప్రభుత్వం చేపట్టనున్న పలు పథకాలను వారికి వివరించి అందులో భాగస్వాములయ్యేలాగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.