ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ తీవ్రవాద సంస్థ చీఫ్ ముల్లా ఒమర్ ఓడరేవు నగరమైన కరాచీలో ఉన్నట్టు వస్తున్న వార్తలను పాకిస్థాన్ తోసిపుచ్చింది. తాలిబన్ తీవ్రవాదులపై అమెరికా జరుపుతున్న డ్రోన్ దాడుల నుంచి ఒమర్ను పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ రక్షించినట్టు వాషింగ్టన్ టైమ్స్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిపై పాక్ పాలకులు వెంటనే స్పందించారు.
దీనిపై పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ బాసిత్ ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి అర్థరహితమైన వార్తలపై స్పందించలేమన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒమర్ పాక్లో ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.
తమ వద్ద ఉన్న సమాచారం మేరకు ఈ తాలిబన్ చీఫ్ ఆఫ్ఘనిస్థాన్లోనే ఉన్నారని చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఆయన మరోచోట ఉన్నట్టు గుర్తించినా, సమాచారం సేకరించినా.. దాన్ని తమతో పంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఒమర్పై తాము సానుభూతి చూపుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
ఇదిలావుండగా, సీఐఏ మాజీ సీనియర్ అధికారి, అమెరికా నిఘా సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు వాషింగ్టన్ టైమ్స్తో మాట్లాడుతూ.. డ్రోన్ దాడుల నుంచి ఒమర్ను ఐఎస్ఐ సురక్షితంగా తప్పించిందని, ఆయనను క్వెట్టా నుంచి కరాచీకి విమానంలో పంపిందని చెప్పారు. ఇది పవిత్రమాసమైన రంజాన్ నెలాఖరులో జరిగినట్టు వీరు తెలిపారు.