ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » మాపై వాషింగ్టన్ ఒత్తిడి లేదు: పాక్ మంత్రి ఖురేషీ (Delhi | Hurriyat | talks | Pakistan | Shah Mehmood Qureshi | 26/11 attacks)
తమపై అగ్రదేశం అమెరికాతో పాటు.. మరే ఇతర దేశం ఒత్తిడి లేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా ముహ్మద్ ఖరేషీ స్పష్టం చేశారు. అలాగే, కాశ్మీర్ సమస్యపై భారత ప్రభుత్వం, వేర్పాటు వాదుల మధ్య పాక్ జోక్యం లేకుండా జరిగే చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోవని ఆయన జోస్యం చెప్పారు.
తన సొంత పట్టణమైన ముల్తాన్లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ జోక్యం లేకుండా కాశ్మీర్ వేర్పాటువాదులు, భారత ప్రభుత్వం మధ్య జరిగే చర్చలు ఫలప్రదం కాబోవన్నారు. ఇకపోతే... భారత్, పాకిస్థాన్ దేశాల సంబంధాలపై ఆయన స్పందిస్తూ ఇరు దేశాల మధ్య జరిగే చర్చలు అర్థవంతంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఇదే విషయాన్ని ఇటీవల కాబూల్లో సమావేశమైన భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం.కృష్ణకు తెలియజేశానని ఖురేషీ తెలిపారు. అలాగే, ముంబై దాడులకు సంబంధించి అమెరికాతో పాటు... ఇతర దేశాల నుంచి తమపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఖురేషీ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా, ఇలాంటి ఒత్తిడికి పాకిస్థాన్ తలొగ్గబోదని ఆయన స్పష్టం చేశారు.