ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » మత ఛాందసవాదానికి అడ్డుకట్ట వేయాలి: ప్రధాని (PM | America | Washington | Terrorist | Afghanistan | Soviet union)
ప్రపంచంలో పెచ్చుమీరిపోతున్న మత ఛాందసవాదానికి అడ్డుకట్ట వేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్లో మత ఛాందసవాదం పైచేయి సాధిస్తే దక్షిణాసియా, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలతో పాటు యావత్ ప్రపంచానికీ శాంతి సుస్థిరతలకు భంగం వాటిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధాని అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు ఒక న్యూస్ మ్యాగజైన్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1980 సంవత్సరంలో ఆఫ్ఘన్లో సోవియట్ యూనియన్ను ఓడించేందుకు మత ఛాందసవాదాన్ని వాడుకోవడం జరిగిందనీ, ఇప్పుడు అక్కడ ఎదుర్కొనవలసింది అదే గ్రూపుననీ ప్రధాని గుర్తు చేశారు.
అప్పట్లో సోవియట్ యూనియన్ను ఓడించిన వారు ఇప్పడు మరో అగ్రరాజ్యాన్ని ఓడిస్తే ఆ శక్తులు మరింతగా బలపడిపోయి యావత్ ప్రపంచానికే సవాల్ చేసే విపత్కర పరిస్థితి ఎదురు కాగలదన్నారు.
ఆఫ్ఘన్ పునర్ నిర్మాణంలో అమెరికాతో పాటు.. ఇతర ప్రపంచ దేశాల ప్రమేయాన్ని తాము కోరుకుంటున్నామని తెలిపారు. గడచిన కొద్దికాలంగా అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ప్రభుత్వ పనితీరు బగానే ఉందన్నారు. పరిపాలనను మెరుగుపరిచే విషయంలో కొన్ని సమస్యలున్నాయని, ఇవి కూడా కాలక్రమేణా సర్ధుకుంటాయని చెప్పారు.