పాకిస్థాన్లోని అణ్వాయుధాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ కాలంలో జాతీయ భద్రతా సలహాదారుగా పని చేసిన స్టీఫెన్ హెడ్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు పాకిస్థాన్లో పెరిగిపోతున్న తీవ్రవాదులు చొరబాట్లు.. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో జోరుగా సాగుతున్న యుద్ధం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న యూఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ అనే సంస్థకు ఆయన ఈ మేరకు సలహా ఇచ్చారు.
పాకిస్థాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలపై అనేక సందేహాలు నెలకొంటున్నాయి. పాక్లో పాలన అస్తవ్యస్తంగా ఉందని, అసలు వారు ఏ దిశగా పయనిస్తున్నారో అర్థం కావడం లేదని ఆదివారం జరిగిన ఒక భద్రతా సదస్సులో ఆయన అభిప్రాయపడ్డారు.