ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారతదేశానికి ప్రధానమంత్రి అవుతానని కలలో కూడా ఊహించలేదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. దీనికంతటకీ ప్రధాన కారణం.. తన విద్యాభ్యాసమేనన్నారు.
అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు ఆయన సీఎన్ఎన్ న్యూస్ ఛానల్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని మార్గనిర్ధేశం చేసే పదవి (ప్రధాని)ని అధిరోహిస్తానని ఏనాడు కలగనలేదన్నారు.
ఇంతటి స్థాయికి ఎదిగినప్పటికీ.. నేను నేనుగానే ఉన్నట్టు చెప్పారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన తాను ప్రధానమంత్రి పదవి చేపట్టే స్థాయికి చేరుకోవడానికి మనం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానం మరో కారణమన్నారు.
అయితే, దేశం ఎదుర్కొంటున్న పేదరికం, నిరక్ష్యరాస్యత, అందరికీ మెరుగైన వైద్య సౌకర్యం, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి కీలక సమస్యలను పరిష్కరించడం మనముందున్న సవాళ్లని, వీటిని అధిగమించడమే ప్రపంచానికి మనం ఇచ్చే గొప్ప సందేశమని ఆయన మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.