ముంబై దాడులతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఆపరేషన్ కమాండర్ జకీవుర్ రెహ్మాన్తో సహా మరో ఆరుగురిపై విచారణ ఆగిపోయిందని పాకిస్థాన్ వెల్లడించింది. ఈ విచారణ ముందుకు సాగాలంటే ఈ కేసులో కీలకమైన ఇద్దరు భారతీయ సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడానికి ఒక కమిషన్ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు పాకిస్థాన్ అంతర్గత భద్రతా శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ వెల్లడించారు.
దీనిపై ఆయన శనివారం ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసు విచారణకు భారత్లో ఉన్న సాక్షులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపేందుకు తమ దేశ చట్టాలు అంగీకరించవన్నారు. అందువల్ల ఒక విచారణ కమిషన్ను ఏర్పాటు చేసే విషయాన్ని తాము పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
ఈ కమిషన్ భారత్ వెళ్లి ముంబై దాడుల్లో పాలు పంచుకున్న పాకిస్థాన్ టెర్రరిస్టు అజ్మల్ కసబ్ నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డు చేసిన మేజిస్ట్రేట్, ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారి స్టేట్మెంట్లను రికార్డు చేయడానికి సమర్థులైన అధికారులతో ఒక కమిషన్ను ఏర్పాటు చేసే విషయాన్ని ఇటీవల భారత హోం మంత్రి చిదంబరంతో జరిపిన టెలిఫోన్ సంభాషణ సందర్భంగా ఆయనతో చర్చించినట్లు మాలిక్ వెల్లడించారు.