ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » 11 నుంచి కర్ణాటక సీఎం యడ్యూరప్ప చైనా పర్యటన! (Karnataka | CM | China | Bangalore | Yeddyurappa | World Economic Forum)
కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప శనివారం నుంచి నాలుగు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. చైనా పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ఆహ్వానించనున్నారు. షాంఘైలో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్)లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.
శనివారం బెంగుళూరు నుంచి బయలుదేరే ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి ముర్గేష్ నిరానీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా వెళ్లనుంది. అలాగే, టియాంజిన్లో జరిగే ఛాంపియన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశానికి కూడా యడ్యూరప్ప హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి వెంట వెళ్లే ప్రతినిధుల బృందంలో ఆర్.ఆర్.సింఘ్వీ, చెందర్ బెల్జీ, అరూన్ రెమాన్, ఎం.ఆర్.జైశంకర్, ఎస్.చంద్రశేఖర్, విలో మోరోవాలా పటేల్, అమన్ అగర్వాల్ తదితరులు ఉన్నారు.
దీనిపై కర్ణాటక పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వి.పి.బోలిగర్ స్పందిస్తూ.. టియాంజిన్లో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి వంద మంది కొత్త ఇండస్ట్రియల్ ఛాంపియన్స్తో సమావేశం అవుతారని చెప్పారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రతినిధి బృందం చైనాలోని కొన్ని పరిశ్రమ కేంద్రాలను కూడా సందర్శిస్తారని చెప్పారు. ఈయన ఈనెల 15వ తేదీన రాజధానికి చేరుకుంటారు.