దేశ అత్యున్నత పదవికి తన పేరును ప్రతిపాదించడం ఇతర మహిళా లోకానికి స్ఫూర్తినివ్వడమే కాకుండా.. మహిళా సాధికారికతకు దోహదపడుతుందని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రతిభా పాటిల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్లతో సమావేశం అయ్యేందుకు ఆమె శనివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రపతి పదవికి తనను ఎంపిక చేయడం మహిళా సమాజానికే గొప్ప చర్య అన్నారు. యూపీఏ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఎంపికతో మన దేశం మహిళలకు అత్యంత గౌరవం ఇస్తుందన్ని విషయాన్ని ప్రస్ఫుటం చేస్తుందని 72 సంవత్సరాల ప్రతిభా పాటిల్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు శనివారం ఉదయాన్నే జైపూర్ నుంచి దేశ రాజధానికి చేరుకున్న పాటిల్ సోనియా గాంధీతో జనపథ్లోని ఆమె నివాసంలో సమావేశమయ్యారు. పిమ్మట ప్రధాని మన్మోహన్తో పాటు ఇతర యూపీఏ లెఫ్ట్ నేతలతోను పాటిల్ సమావేశంకానున్నారు. ప్రతిభా పాటిల్ ప్రస్తుతం రాజస్ధాన్ గవర్నర్గా కొనసాగుతున్న విషయం తెల్సిందే.
|