జాతిపిత మహాత్మాగాంధీ స్వదస్తూరితో రాసిన ఏడు పేజీల లేఖ వచ్చెనెల మూడో తేదీన లండన్లో వేలం వేయనున్నారు. దీన్ని స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. దీనిపై తక్షణం స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసింది.
గాంధీజీ హత్యకు గురికావడానికి 19 రోజులకు ముందు ఏడు పేజీల లేఖను రాశారు. ఇందులో ముస్లీం ప్రజల పట్ల సహనం పాటించాలని పేర్కొన్నారు. అయితే.. వేలానికి సమయం దగ్గర పడుతుండటంతో లేఖ ప్రతిని సంపాదించేందుకు కేంద్రం అన్ని చర్యలు చేపట్టింది. కేంద్ర సాంస్కృతిక, విదేశాంక మంత్రిత్వ శాఖలు అత్యవసర సమావేశాన్ని గురువారం నిర్వహించాయి.
శుక్రవారం పీఎంఓ కార్యాలయంలో మరోమారు సమావేశమై.. లేఖ ప్రతిని ఎలా సంపాదించాలన్న అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటారు. వేలం పాటలో నెహ్రూ మ్యూజియం, లైబ్రరీ మూలంగా బిడ్ దాఖలు చేయడమా? లేదా పురాతన గ్రంథాల పరిరక్షణలో భాగంగా లేఖను వేలం వేయకుండా చర్యలు చేపట్టడమా? వేలం వేస్తున్న క్రిస్టీస్ సంస్థకు వ్యతిరేకంగా ఇంజెక్షన్ ఆర్డర్లు జారీ చేయడమా? అనే అంశాలను కేంద్రం పరిశీలిస్తోంది.
ఇదిలావుండగా గాంధీజీ లేఖతో పాటు.. నెపోలియన్, విన్స్టర్ చర్చిల్, ఆస్కార్ వైల్డ్ తదితరుల లేఖలను కూడా క్రిస్టీస్ సంస్థ వచ్చే నెలలో వేలం వేయనుంది. అయితే గాంధీజీ లేఖ మాత్రం ఏడు నుంచి పది లక్షల రూపాయల మేరకు ధర పలకవచ్చని వేలం నిర్వాహకులు భావిస్తున్నారు.
|