భారత్-అమెరికా దేశాలు కుదుర్చుకున్న పౌర అణు సహకార ఒప్పందంపై వామపక్షాలు అవలంబిస్తున్న వైఖరి కేవలం కంటి తుడుపు లాంటిదని సమాజ్వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ దుయ్యబట్టారు. లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేవలం తం అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వరకే వామపక్షాలకు తెలుసునన్నారు.
ప్రభుత్వాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతున్న వామపక్షాలు ఎలా ప్రతిపక్ష పాత్ర పోషించగలవని ప్రశ్నించారు. తమ పార్టీ ఈ ఒప్పందాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపిన ములాయం ఈ విషయంలో తృతీయ కూటమి నేతలైన చంద్రబాబు, జయలలితతో సహా ఇతర నేతలను కలుపుకుని ముందుకు సాగుతామన్నారు. దీనిపై వచ్చే నెల ఢిల్లీలో తమ కూటమి తరపున భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు ములాయం సింగ్ ప్రకటించారు.
|