వచ్చే సెప్టెంబరులో జరిగే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) సమావేశానికి హాజరుకావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే ఇండో-యూఎస్ ఒప్పందంపై లెఫ్ట్ పార్టీలు లేవనెత్తుతున్న అభ్యంతరాలను సమావేశానికి ముందుగానే పరిష్కరించేందుకు కృషి చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వెల్లడించారు.
యూపీఏలోని మిత్రపక్షాలన్నీ కాంగ్రెస్కు బాసటగా నిలిచాయని, అందువల్ల దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఐఏఈఏ సమావేశానికి హాజరుకావాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు వెల్లడించారు. అదేసమయంలో.. అణు ఒప్పందంపైవచ్చే సూచనలను, సలహాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. అమెరికా ఆమోదించిన హైడ్ చట్టంలోని షరతులన్నింటికీ భారత్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని, దేశ ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లనంత కాలమే ఈ ఒప్పందం అమలువుతుందని సింఘ్వీ గుర్తు చేశారు.
|