అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) సమావేశానికి కేంద్రం హాజరుకావడం వల్ల తమకెలాంటి అభ్యంతరం లేదని సీపీఎం అగ్ర నేత సీతారాం ఏచూరీ స్పష్టం చేశారు. ఇండో-యూఎస్ అణు ఒప్పందంపై ప్రభుత్వం-లెఫ్ట్ పార్టీల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు జరుపుతున్న చర్చల్లో భాగంగా ఆయన కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో మంగళవారం సమావేశమయ్యారు.
అనంతరం ఏచూరీ విలేకరులతో మాట్లాడుతూ ఐఏఈఏ సమావేశానికి భారత్ హాజరు కావచ్చునని, అయితే అణు ఒప్పందం గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ చర్చించకూడదని ఆయన స్పష్టం చేశారు. సభ్యదేశంగా ఐఏఈఏ వార్షిక సమావేశంలో పాల్గొనడం సాధారణమేనని ఏచూరి అన్నారు.
లెఫ్ట్ పార్టీలు విజ్ఞప్తి మేరకు 123 ఒప్పందం అమలు వల్ల కలిగే లాభనష్టాలను అధ్యయనం కోసం వేసే కమిటీ ఏర్పాటు ఎంతవరకొచ్చిందన్న ప్రశ్నకు ఏచూరీ సమాధానం ఇస్తూ.. ‘కమిటీ వేయమని వారికి సూచించాం. రోజు జరిగే పరిణామాలను గమనిస్తున్నాం.’ అన్నారు.
|