భారత్-అణు ఒప్పందాన్ని ఇపుడే అమలు చేయవద్దని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ సూచించారు. ఈ ఒప్పందంపై యూపీఏ-వామపక్ష పార్టీల మధ్య మరోసారి త్వరలో చర్చలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్ కారత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అణు ఒప్పందానికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో ప్రకాష్ కారత్ పాల్గొని ప్రసంగించారు. ఇండో-యూఎస్ అణు ఒప్పందంపై కేంద్రం ఆచితూచి అడుగులు వేయాలని హితవు పలికారు.
ముఖ్యంగా.. ఇందులోని సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అందువల్ల ఒప్పందాన్ని మరో ఆరు నెలల పాటు అమలు చేయకుండా నిలుపుదల చేయాలని కారత్ కోరారు. ఇదిలావుండగా.. వియత్నాంలో జరుగుతున్న అంతర్జాతీయ అణు సంఘ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి శివశంకర్ మీనన్ పాల్గొనడంపై వామపక్షాలు ఇప్పటికే గుర్రుగా వున్న విషయం తెల్సిందే.
|