తనను హతమార్చేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుట్ర పన్నారని ఆయన మంత్రివర్గంలోని పర్యాటక శాఖ మంత్రి బి.శ్రీరాములు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా గురువారం సంచలనం సృష్టించాయి. దీనిపై శ్రీరాములు మాట్లాడుతూ.. తనను హతమార్చడానికి కుమార స్వామి కిరాయి హంతకులను నియమించారన్నారు. అందువల్ల ఆయనపై క్రిమినల్ కేసు పెట్టనున్నట్టు మంత్రి శ్రీరాములు వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించడమే కాకుండా.. ఓ ముఖ్యమంత్రిపై ఆయన మంత్రివర్గంలోని మంత్రే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం స్వతంత్ర భారతంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనిపై కుమారస్వామి తండ్రి మాజీ ప్రధాని దేవేగౌడ స్పందిస్తూ.. మంత్రి ఆరోపణలు తనను చాలా నొప్పించాయని ఇలాంటి సమయంలో అధికార మార్పిడి గురించి మాట్లాడటం అర్థరహితమని ఆయన వ్యాఖ్యానించారు.
|