రాజకీయ సంక్షోభంలో ఉన్న కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించే విషయంపై కేంద్ర కాబినెట్ మంగళవారం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మంగళవారం రాత్రి కాబినెట్ భేటీ కానుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామి నేతృత్వంలోని జేడీ (ఎస్) ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును భారతీయ జనతా పార్టీ ఇటీవల ఉపసంహరించుకున్న విషయం తెల్సిందే. దీంతో జేడీ (ఎస్) ప్రభుత్వం మైనారిటీలో పడింది.
దీంతో తన ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాల్సిందిగా గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ సోమవారం రాత్రి కేంద్రాన్ని కోరారు. దీంతో కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించే విషంపై తుది నిర్ణయం తీసుకునేందుకు కాబినెట్ సమావేశం కానుంది.
ఇదిలావుండగా.. కర్ణాటక పరిస్థితిపై కాంగ్రెస్ నేతలు ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, అర్జున్ సింగ్, ఏకే.ఆంటోనీ, హెచ్ఆర్.భరద్వాజ్, జాతీయ భద్రతా సలహాదారు ఎంకే.నారాయణన్, హోం శాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
|