లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సత్తా చాటుకోవాలని కేంద్ర రైల్వేమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సవాల్ విసిరారు. లోక్సభకు మధ్యంతర ఎన్నికలు వస్తాయని లాలూ భయపడుతున్నారని నితీష్ కుమార్ చేసిన విమర్శలకు స్పందించిన లాలూ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...
బీహార్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికల్లో నితీష్ తన సత్తా నిరూపించుకోవాలని తెలిపారు. బీహార్లో రోజురోజుకి నేరాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందలేదని ఆయన ధ్వజమెత్తారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకొస్తే ముఖ్యమంత్రి భూములను కేటాయించడంలో జాప్యం చేస్తున్నారని లాలూ విమర్శల వర్షం కురిపించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పున ఉన్న జిల్లాలను విభజించి పూర్వాంచల్ రాష్ట్ర ఏర్పాటుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి సుముఖత స్పష్టం చేస్తున్నారని లాలూ అభిప్రాయపడ్డారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశంపై బిల్లు ప్రవేశపెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుపుతున్నట్లు లాలూ తెలిపారు.
|