గోద్రా నరమేధానికి కారకులైన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, భాజపా అగ్రనేత ఎల్కే.అద్వానీలను తక్షణం అరెస్టు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. గోద్రా అల్లర్లకు కారణమైన సూత్రధారుల పేర్లను తెహల్కా డాట్ కామ్ తాజాగా బయటపెట్టిన విషయం తెల్సిందే. దీనిపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందిస్తూ.. గోద్రా దురాగతంపై తెహల్కా చేపట్టిన 'ఆపరేషన్ కలంక్' నరేంద్ర మోడీ, అద్వానీల పాత్రను బట్టబయలు చేసిందన్నారు.
ఈ నరమేధం వెనుక దాగినవున్న నిజమైన శక్తులను ప్రజలు ఇప్పటికైనా తెలుకున్నారని లాలూ శుక్రవారం పాట్నాలో విలేకరులతో అన్నారు. నరమేధానికి కారణభూతులైన వీరిద్దరిలో లోక్సభలో ప్రతిపక్ష నేత హోదా అనుభవిస్తున్న అద్వానీ మినహాయిస్తే నరేంద్ర మోడి, తాను చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరని లాలూ జోస్యం చెప్పారు. అంతేకాకుండా.. వీరిద్దరిపై తక్షణం క్రిమినల్ కేసులు నమోదు చేసి, జైలుకు పంపాలని లాలూ డిమాండ్ చేశారు.
|