నందిగ్రామ్ను సాకుగా తీసుకుని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మావోయిస్టుల సహకారంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ కుట్ర పన్నుతున్నారని సీపీఎం మంగళవారం ఆరోపించింది.
నందిగ్రామ్ హింస వెనుక రాష్ట్రప్రభుత్వం హస్తమున్నదంటూ సోమవారం దాస్మున్షీ చేసిన వ్యాఖ్యలపై సీపీఎం పార్లమెంటరీ నేతలు సీతారాం ఏచూరి, బాసుదేబ్ అచారియా సంయుక్తంగా చేసిన ప్రకటనలో తీవ్రంగా స్పందించారు.
గడచిన పదకొండు మాసాలుగా మావోయిస్టుల సహకారంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నందిగ్రామ్లో హింసాత్మక వాతావరణాన్ని సృష్టించిందని వారు విమర్శించారు. కేంద్ర మంత్రిగా దాస్మున్షీ చేసిన వ్యాఖ్యలు తమను దిగ్భ్రాంతికి లోను చేసిందని ప్రకటనలో పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరిన వెంటనే కేంద్రప్రభుత్వం నందిగ్రామ్కు సీఆర్పీఎఫ్ దళాలను పంపడంలో తలెత్తిన జాప్యానికి దాస్మున్షీ బాధ్యత వహించాలని సీపీఎం పార్లమెంట్ సభ్యులు తమ ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.
|