భారత్-అమెరికా దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం వల్ల దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత ఎల్కే.అద్వానీ స్పష్టం చేశారు. బుధవారం లోక్సభలో అణు ఒప్పందంపై చర్చ జరిగింది. దీనిపై ప్రతిపక్ష నేత ఎల్.కె.అద్వానీ మాట్లాడుతూ ఒప్పందం వల్ల భవిష్యత్తులో అణు పరీక్షల నిర్వహణను భారత్ వదులుకోవలసి వస్తుందని పేర్కొన్నారు.
అందువల్ల ఒప్పందాన్ని దేశం సమర్థించబోదని అద్వానీ స్పష్టం చేశారు. దేశ దీర్ఘ ప్రయోజనాలకు కేంద్రం దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఒక వేళ పార్లమెంటు అభిప్రాయాన్ని తోసిరాజని ఒప్పందం చేసుకున్నా కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటైతే... ఒప్పందం రద్దు చేసుకోవడానికి వీలులేని పక్షంలో దానిని పునఃసమీక్షిస్తామని, మళ్లీ అమెరికాతో చర్చించి ఇబ్బందికర అంశాలను తొలగించేలా చూస్తామని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అణు ఒప్పందం ఏవిధంగానూ ఆమోదయోగ్యం కాదని అద్వానీ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా తొలి అణు పరీక్ష నిర్వహించిన ఇందిరాగాంధీ, ఫోఖ్రాన్ అణు పరీక్షను నిర్వహించిన వాజ్పేయి పేర్లను అద్వానీ పదే పదే సభలో ప్రస్తావించారు.
|