అణు ఒప్పందం ప్రకంపనలు సద్దుమణిగాయని అనుకుంటున్న తరుణంలో సీపీఎం ఆదివారం మరోబాంబు పేల్చింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థతో జరుపుతున్న చర్చలు ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని గడువు విధించింది. లేని పక్షంలో మధ్యంతర ఎన్నికలు ఎదుర్కొనక తప్పదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ హెచ్చరించారు. దీనిపై ఆయన ఆదివారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. కేంద్రంలోని యూపీఏ సర్కారు తాము చెప్పినట్టుగా వినకపోతే మద్దుతును ఉపసంహరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
భారత్-అమెరికా అణు ఒప్పందాన్ని ఆది నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వామపక్షాలు ఇటీవలి కాలంలో తమ పట్టును కొంతమేరకు సడలించాయి. దీంతో.. ఊపిరిపీల్చుకున్న కాంగ్రెస్.. అంతర్జాతీయ అణు శక్తి సంస్థతో చర్చలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన సీపీఎం సమావేశంలో పాల్గొన్న ప్రకాష్ కారత్.. కాంగ్రెస్ పార్టీకి తాజా అల్టిమేటం ఇచ్చారు. ఐఈఏఐతో జరుపుతున్న చర్చలు తక్షణం పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
|