జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పాటు దిశగా వామపక్షాలు, లౌకిక మరియు ప్రజాస్వామ్య శక్తులు కార్యచరణకు పూనుకోవాలని సీపీఎమ్ జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ పిలుపునిచ్చారు. స్థానికంగా 19వ రాష్ట్రస్థాయి పార్టీ సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం కారత్ ప్రసంగిస్తూ దేశంలో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీలు వైఫల్యం చెందిన ప్రస్తుత తరుణంలో తృతీయ కూటమి ఆవిర్భవించవలసిన ఆవశ్యకతను ప్రస్తావించారు.
కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నయంగా మరో కూటమి రాత్రికిరాత్రే ఏర్పడటం అసాధ్యమని కారత్ తేల్చి చెప్పారు. సామాన్యులు మరియు కార్మికలు సంక్షేమం కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ఆరోపించారు. ప్రజలకు నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని కారత్ అన్నారు.
|