కర్నాటక రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన విలాసవంతమైన తొలి పర్యాటక రైలును రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర రాజధాని బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో విలాసవంతమైన గోల్డెన్ చరాయిట్ రైలుకు ఆమె పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిభా పాటిల్ ప్రసంగిస్తూ.. కర్నాటక పర్యాటక శాఖ చిరకాల కోరిక లగ్జరీ రైలు ప్రారంభం నేటితో తీరిందని, రాష్ట్రంలోని ప్రముఖ స్థలాలను సందర్శించేందుకు ఈ లగ్జరీ రైలు సేవలు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా మరింత పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తం 19 విలాసవంతమైన బోగీలు కలిగిన ఈ రైలు ద్వారా బెంగుళూరు నుంచి బయలుదేరి వారం రోజుల పాటు మైసూర్, కబిని, హస్సన్, బెలుర్, శ్రావణబెళగోల, హంపి, అహిహొల, పట్టదకల్, బాద్మి, గోవా మార్గాల ద్వారా ప్రయాణించి తిరిగి బెంగళూరు చేరుకోవచ్చు. కర్ణాటక చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్లాస్మా టీవి వంటి అత్యాధునిక వసతులతో ఈ రైలును డిజైన్ చేశారు.
మైసూర్, బెలుర్ వంటి ప్రసిద్ధిగాంచిన కట్టడాలకు ఉపయోగించిన వాస్తుశాస్త్రాన్ని ఉపయోగించి ఈ రైలు క్యాబిన్ భాగం రూపొందించారు. రైలు బోగీల్లో కర్నాటక సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా పడకలను నిర్మించినట్లు పర్యాటక శాఖ అధికారులు వివరించారు.
|