ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై యూపీ ప్రభుత్వం చర్య తీసుకున్న వ్యవహారంపై స్పందించిన గవర్నర్ వైఖరిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయవతి మండిపడ్డారు. ఈ అంశంపై లేఖ రాయడానికి బదులుగా తనను సంప్రదించి వుండవచ్చని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీతో పాటు.. నెహ్రూ కుటుంబంపై ప్రశంసలు వున్న పుస్తకానికి ఇద్దరు ఐఏఎస్ అధికారులు ముందుమాట రాశారు. దీనిపై స్పందించిన మాయవతి ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. దీన్ని తప్పుపడుతూ గవర్నర్ ఆమెకు లేఖ రాశారు.
మీడియా వార్తల ఆధారంగా చేసుకుని గవర్నర్ ఇలా స్పందించడం సమంజసం కాదని మాయావతి వ్యాఖ్యానించారు. నెహ్రూతో పాటు రాజీవ్, సోనియాలు అంటే తనకు ఎనలేని గౌరవంవుందని, అయితే ప్రభుత్వ అధికారులు రాజకీయాల జోలికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ముందుమాట రాసిన ఇద్దరు ఐఏఎస్ అధికారులపై చర్య తీసుకున్నట్టు మాయావతి వివరణ ఇచ్చారు. దీంతో గవర్నర్, మాయవతిల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.
|