ముంబై నవనిర్మాణ్ సేన అధినేత రాజ్థాక్రేను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసేందుకు ముంబై పోలీసులు సిద్ధమయ్యారు. ఇందుకోసం రాజ్థాక్రేకు బుధవారం సాయంత్రం మూడు గంటల వరకు గడువు విధించారు. అలాగే సమాజ్వాదీ పార్టీ నేత అబూ అసిం ఆజ్మీని మాత్రం ముందుగానే లొంగి పోయేందుకు పోలీసు స్టేషన్కు వెళ్లినప్పటికీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేయకుండా ఇంటికి పంపించి వేశారు. ఇదిలావుండగా రాజ్థాక్రేను అరెస్టు చేయనున్నట్టు వస్తున్న వార్తలతో మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు అల్లర్లకు పాల్పడుతున్నారు. పూణే, నాసిక్, షోలాపూర్, ఔరంగాబాద్, లాతూర్లలో కార్యకర్తలు విధ్వంసాలకు పాల్పడుతున్నారు.
అలాగే ఆ పార్టీకి చెందిన అగ్రనేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లగా రాజ్థాక్రే మాత్రం తన నివాసంలోనే వుండిపోయి, కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నారు. అంతేకాకుండా రాజ్థాక్రేపై కేసు నమోదు చేసిన అనంతరం ఆయన నోరు మెదపవద్దని, కార్యకర్తలను కలుసుకోవద్దని, మీడియా సమావేశాలు ఏర్పాటు చేయకూడదని, నివాసం వదిలి బయటకు వెళ్ళరాదనే అంక్షలు విధిస్తూ ముంబై పోలీసులు నోటీసు జారీ చేశారు. అయితే.. ఈ నోటీసులను తీసుకునేందుకు ఆయన నిరాకరించడంతో ఈయన ఇంటికి అంటించారు.
|